ప్రజా సేవలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు : సాలూర మండల ప్రత్యేక అధికారి డి.పద్మ
ఎంపీడీఓ కార్యాలయంలో శాఖల వారీగా సుదీర్ఘ సమీక్ష
పాఠశాలలు, ఆసుపత్రుల ఆకస్మిక తనిఖీ.. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా
ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి పేదవాడికి చేరాలని సాలూర మండల ప్రత్యేక అధికారి, నిజామాబాద్ జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి డి.పద్మ స్పష్టం చేశారు. శుక్రవారం ఆమె సాలూర మండల కేంద్రంలో పర్యటించి, పాలనాపరమైన అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. తొలుత ఎంపీడీఓ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో ఆమె సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి శాఖ పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పనులు, మిషన్ భగీరథ నీటి సరఫరా, విద్యుత్ సమస్యలపై అధికారులను ఆరా తీశారు. వేసవి కాలం దృష్ట్యా తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ ఏఈలను ఆదేశించారు. సేవల్లో ఎటువంటి జాప్యం జరగకూడదని, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకూడదని హెచ్చరించారు. సాలూర ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను సందర్శించిన ప్రత్యేక అధికారి అక్కడ విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించారు. వంట గదులను తనిఖీ చేసి నాణ్యమైన సరుకులు వాడుతున్నారా లేదా ఆరా తీశారు. మెనూ ప్రకారం గుడ్లు, పౌష్టికాహారం అందించాలని భోజనం రుచికరంగా ఉండాలని స్పష్టం చేశారు. విద్యార్థులతో ముచ్చటించి వారి చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు. సాలూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆమె, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో మందుల నిల్వలు, గర్భిణీలకు అందుతున్న కిట్లు, టీకాల పంపిణీపై రిజిస్టర్లను పరిశీలించారు. అత్యవసర సమయంలో వైద్యులు అందుబాటులో ఉండాలని, గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని వైద్యాధికారి రాజ్కుమార్కు సూచించారు. అనంతరం బోధన్ పట్టణం అచన్పల్లిలోని ఉన్న మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ సంక్షేమ గురుకుల (సాలూర) పాఠశాలను ఆమె సందర్శించారు. పాఠశాలలోని తరగతి గదులు, హాస్టల్ వసతులు, తాగునీటి సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించాలని ప్రిన్సిపాల్ మహేశ్వరికి సూచించారు. విద్యార్థుల ఆరోగ్య విషయంలో రాజీ పడకూడదని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఈ విస్తృత స్థాయి తనిఖీలు, సమీక్షలో సాలూర ఎంపీడీఓ హెచ్. శ్రీనివాస్, ఎంఈఓ రాజి మంజూష, ఎంజేపీటీ ప్రిన్సిపాల్ మహేశ్వరి, పీహెచ్సీ వైద్యాధికారి రాజ్కుమార్, ఏపీఎం ఐకేపీ సాయిలు, ఐసీడీఎస్ సూపర్వైజర్ గంగావేణి, విద్యుత్ శాఖ ఏఈ కళ్యాణ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రామ్ యాదవ్, మిషన్ భగీరథ ఏఈ రోహిత్, పంచాయతీ రాజ్ ఏఈ శివ తదితర శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

