కెనాల్లో పడి నాలుగేళ్ల బాలుడు మృతి
నిజామాబాద్ జిల్లాఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కాలువలో పడి హఫీజ్ అనే నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. గ్రామ సమీపంలోని నిజాంసాగర్ కెనాల్ వద్ద సదరు బాలుడు తన మిత్రులతో కలిసి ఆడుకుంటుండగా, అకస్మాత్తుగా కాలువలో పడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ, నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో బాలుడు ప్రవాహంలో కొట్టుకుపోయాడు. కొంత సమయం తర్వాత గ్రామ శివారులో బాలుడి మృతదేహం నీటిపై తేలుతూ కనిపించడంతో స్థానికులు బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటివరకు కళ్లముందే ఆడుకున్న చిన్నారి విగతజీవిగా మారడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది.

