సాలూరలో కమనీయంగా శ్రీనివాస కల్యాణం
- భక్తిశ్రద్ధలతో వేంకటేశ్వరస్వామి వివాహ మహోత్సవం
- ప్రజ్ఞశ్రీ పాఠశాల ఆవరణలో ఆధ్యాత్మిక శోభ - మిద్దెల లత రాజు దంపతుల ఆధ్వర్యంలో వేడుకలు
సాలూర మండల కేంద్రంలోని ప్రజ్ఞశ్రీ పాఠశాల ప్రాంగణం సోమవారం ఆధ్యాత్మిక రంగులమయమైంది. శ్రీలక్ష్మి పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించారు. మిద్దెల లత రాజు దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి తన్మయత్వం చెందారు. అర్చక స్వాముల వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. పుణ్యాహవాచనం, మాంగళ్య ధారణ ఘట్టాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తుల గోవింద నామ స్మరణతో పాఠశాల ప్రాంగణం మారుమోగింది.
అచ్చం వేంకటేశ్వరుడిలా.. విద్యార్థుల వేషధారణ
ఈ కల్యాణ మహోత్సవంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది విద్యార్థుల వేషధారణ. పాఠశాల విద్యార్థులు శ్రీనివాసుడు, పద్మావతి అమ్మవార్ల రూపాల్లో అలంకరించుకుని సాక్షాత్తు ఆ దేవదేవుడే ధరణికి దిగివచ్చాడా అన్నట్లుగా భక్తులకు కనువిందు చేశారు. చిన్నారుల వేషధారణ, వారి ముఖాల్లోని దైవిక కళాకాంతులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కల్యాణ క్రతువు జరుగుతున్న సమయంలో విద్యార్థులు ప్రదర్శించిన భక్తి నృత్యాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని రెట్టింపు చేశాయి. అన్నమయ్య కీర్తనలు, గోవింద నామాలకు అనుగుణంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను మంత్రముగ్ధులను చేశాయి. చిన్నారుల అభినయం, భక్తిభావం కల్యాణ శోభను మరింత పెంచాయి.

మహోత్సవానికి విచ్చేసిన భక్తులందరికీ నిర్వాహకులు భోజన తాంబూలాదులను ఏర్పాటు చేశారు. లోక కల్యాణం కోసం, అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ ఈ వేడుకను నిర్వహించినట్లు మిద్దెల లతరాజు దంపతులు తెలిపారు. కార్యక్రమంలో సాలూర ప్రజలు, విద్యాసంస్థల ప్రతినిధులు, ఉపాధ్యాయులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



