సాలూరలో మిన్నంటిన కుస్తీ పోటీల సందడి
- ఘనంగా శివరాత్రి ఉత్సవాలు.. ఉత్సాహంగా కొనసాగిన జాతర
సాలూర మండల కేంద్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంబరాన్నంటాయి. పండుగను పురస్కరించుకుని సోమవారం నిర్వహించిన కుస్తీ పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. తరతరాలుగా వస్తున్న ఆనవాయితీని పాటిస్తూ నిర్వహించిన ఈ మల్లయుద్ధ విన్యాసాలు అశేష జనవాహినిని అలరించాయి. శివనామస్మరణతో మారుమోగుతున్న ప్రాంగణంలో, పహిల్వాన్లు తమ భుజబలాన్ని ప్రదర్శిస్తూ హోరాహోరీగా తలపడ్డారు. చిన్నపిల్లల ఆటవస్తువులు, మిఠాయి దుకాణాలు, రంగుల రాట్నాలతో జాతర ప్రాంగణం కళకళలాడింది. గ్రామ పోలీస్ పటేల్ వెంకట్ పటేల్ మాట్లాడుతూ.. పురాతన కాలం నుండి వస్తున్న ఈ కుస్తీ పోటీల సంప్రదాయాన్ని కాపాడటం మన బాధ్యతని, నేటి యువతకు ఈ క్రీడల పట్ల ఆసక్తి పెంచేందుకే ఏటా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గెలుపొందిన విజేతలకు గ్రామ కమిటీ ప్రతినిధులు నగదు బహుమతులను అందజేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామా పెద్దలు సొక్క రవి, లోకప్పగారి లక్ష్మణ్, సంగేపు భూమయ్య, ఇల్తెపు గంగారాం, బుద్దే లక్ష్మణ్, నీరడి నగేష్, గంటె లక్ష్మణ్, వార్డు సభ్యులు, గ్రామ యువకులు, పెద్దలు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

