ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలి.. సేవల్లో అలసత్వం వద్దు
వివిధ శాఖల పనితీరును సమీక్షించిన మండల ప్రత్యేక అధికారి
ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలని, క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని నిజామాబాద్ జిల్లా సాలూర మండల ప్రత్యేక అధికారి, పరిశ్రమల శాఖ ఏడీ వై.రామసుబ్బారెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని సాలూర, అచన్పల్లి పరిధిలో ఆయన సుడిగాలి పర్యటన చేపట్టారు. విద్య, వైద్యం, గృహనిర్మాణం వంటి కీలక విభాగాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా సాలూర ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆయన విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించారు. వంట గది శుభ్రతను చూసి సంతృప్తి వ్యక్తం చేస్తూనే, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. అనంతరం మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ నివాస పాఠశాలలోని పాఠశాలలోని వసతి గదులు, తాగునీటి సౌకర్యాలను పరిశీలించి, విద్యార్థుల చదువుపై ఉపాధ్యాయులతో ఆరా తీశారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన సందర్భంలో రోగుల రికార్డులను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, సామాన్యులకు మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్ రాజ్కుమార్ కు సూచించారు. మందుల కొరత లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకమైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని ఆయన క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. హౌసింగ్ ఏఈ శివతో కలిసి నిర్మాణ దశలను పరిశీలించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బిల్లుల చెల్లింపులు, సాంకేతిక సహకారం అందించాలని పేర్కొన్నారు. గ్రామంలో పారిశుధ్యంపై పంచాయతీ కార్యదర్శికి కీలక సూచనలు చేశారు. ఈ పర్యటనలో ఎంపీడీఓ హెచ్.శ్రీనివాస్, మండల విద్యాధికారి రాజీ మంజుష, వైద్యాధికారి రాజ్కుమార్, పంచాయతీ కార్యదర్శి దయాకర్ రెడ్డి, హౌసింగ్ ఏఈ శివ ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

.jpeg)

