డేటా సెంటర్ల ఏర్పాటుపై సీఎం రేవంత్ కీలక సమీక్ష
రైతులకు ఇచ్చే పరిహారంలో 'ఉదారంగా' ఉండాలి
By R.Suresh
On
భూ కేటాయింపుల్లో హేతుబద్ధత అవసరం: అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం
రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటు, తద్వారా భారీ పెట్టుబడులను ఆకర్షించడంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఐటీ, విద్యుత్, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు డేటా సెంటర్ల ఏర్పాటుకు కల్పిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పొరుగు రాష్ట్రాల కంటే మెరుగైన వసతులు, పారదర్శకమైన విధానాలతో సంస్థలను ఆకర్షించాలని సూచించారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంస్థల వివరాలు, వాటికి అవసరమైన భూమి, ఇతర మౌలిక వసతులపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు.
భూసేకరణ ప్రక్రియలో రైతుల ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. భూములు కోల్పోతున్న రైతులతో అధికారులు నేరుగా మాట్లాడాలని, వారు పూర్తిస్థాయిలో సంతృప్తి చెం దేలా పరిహారం నిర్ణయించాలని సూచించారు. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టే భారీ సంస్థలకు భూమి కోసం చేసే వ్యయం చాలా స్వల్పమని, కాబట్టి పరిహారం విషయంలో ప్రభుత్వం ఉదారంగా ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కంపెనీలకు కేటాయించిన భూమిని నిర్ణీత సమయంలో అప్పగించడంతో పాటు, విద్యుత్, నీరు వంటి మౌలిక వసతులను యుద్ధ ప్రాతిపదికన కల్పించాలని సీఎం ఆదేశించారు. భూ కేటాయింపుల్లో హేతుబద్ధత ఉండాలని, అవసరానికి మించి భూములు కేటాయించకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక తదితరులు పాల్గొన్నారు.

Views: 7
Tags:
About The Author
Latest News
23 Feb 2026 10:08:44
తెలంగాణ రాష్ట్ర రాజకీయ, పరిపాలనా ముఖచిత్రంలో నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. సచివాలయ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర...

