ఏకచక్రేశ్వరాలయానికి పాదయాత్రగా తరలిన భక్తజనం
పవిత్ర శ్రావణ మాస సోమవారాన్ని పురస్కరించుకుని సాలూర మండలం హున్సా గ్రామం భక్తి సాగరంలో మునిగితేలింది. పరమశివుడి దివ్యానుగ్రహం కోసం, సకల జనుల క్షేమాన్ని కాంక్షిస్తూ హున్సా గ్రామానికి చెందిన శివభక్తులు సోమవారం బోధన్లోని చారిత్రాత్మక శ్రీ ఏకచక్రేశ్వర శివాలయానికి మహా పాదయాత్రగా తరలివెళ్లారు. ఉదయాన్నే గ్రామంలోని స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు 'హర హర మహాదేవ.. శంభో శంకరా.. అంటూ శివనామస్మరణ చేస్తూ కాలినడకన బయలుదేరారు. దారి పొడవునా భక్తుల జపాలు, మంత్రోచ్ఛారణలతో పరిసరాలన్నీ ఆధ్యాత్మిక శోభతో మార్మోగిపోయాయి. వయోభేదం లేకుండా మహిళలు, యువకులు, పెద్దలు అత్యంత నిష్ట నియమాలతో ఈ పాదయాత్రలో పాల్గొని తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు. బోధన్ పుణ్యక్షేత్రంలోని శ్రీ ఏకచక్రేశ్వరాలయానికి చేరుకున్న భక్తులకు ఆలయ ప్రాంగణంలో సాదర స్వాగతం లభించింది. పవిత్ర జలాలు, పాలతో స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, విశేష ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. పాదయాత్రగా వచ్చి భోళాశంకరుడిని దర్శించుకుని పూజలు చేయడం వల్ల సమస్త పాపాలు తొలగిపోయి, కుటుంబాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయని భక్తులు పరవశించిపోయారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల వితరణ వైభవంగా జరిగింది.

