సర్కారు బడికి ‘రోటరీ’ చేయూత
దూస్గావ్ బడి పిల్లలకు బెంచీల పంపిణీ
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ప్రశంసనీయమని ఎంఈఓ నరేష్ అన్నారు. డిచ్పల్లి మండలం దూస్గావ్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో, కేర్ డిగ్రీ కళాశాల సహకారంతో బుధవారం విద్యార్థులకు బెంచీలను అందజేశారు. రాఖీ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇన్నాళ్లూ నేలపైనే కూర్చుని పాఠాలు వింటూ ఇబ్బందులు పడ్డ చిన్నారులకు కొత్త బెంచీలు రావడంతో వారి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. బెంచీలపై కూర్చుని మరింత ఉత్సాహంగా చదువుకుంటామని విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ నరేష్ మాట్లాడుతూ.. రోటరీ క్లబ్ గత కొన్నేళ్లుగా విద్యారంగంలో మంచినీటి సౌకర్యం, పుస్తకాలు, బెంచీల పంపిణీ వంటి బహుముఖ సేవలు అందించడం అభినందనీయమన్నారు. సర్కారు బడుల్లోని విద్యార్థులకు సరైన ప్రోత్సాహం దక్కితే అద్భుతాలు సృష్టిస్తారని డీసీఈబీ సెక్రెటరీ సీతయ్య పేర్కొన్నారు.
నిరుపేద విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని రోటరీ క్లబ్ అధ్యక్షుడు శ్రీకాంత్ ఝవార్ తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భూమావతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ సువర్ణ వెంకట్, వీడీసీ చైర్మన్ సాయిలు, రోటరీ క్లబ్ ప్రతినిధులు బెజ్గం అశోక్, అంకిత్ అగర్వాల్, శ్యామ్ అగర్వాల్, కేర్ కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


