వసతి గృహాల్లో మెనూ మారితే కఠిన చర్యలు : - జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
- విద్యార్థుల భద్రత, ఆరోగ్యంపై రాజీ పడొద్దు
ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, భవిత కేంద్రాల నిర్వహణ తీరుపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ లో మండల ప్రత్యేక అధికారులతో ఆమె సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ, భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించకూడదని స్పష్టం చేశారు. మండల ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన గ్రామాల్లో క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో వారు గమనించిన పెండింగ్ పనులు, పాఠశాలల స్థితిగతులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న భవిత కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మార్చి నెలాఖరు నాటికి అన్ని పనులు పూర్తి కావాలని గడువు విధించారు. పాఠశాలల్లో విద్యార్థులకు నిర్ణీత మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి. మెనూ పాటించని వారిపై, కలుషిత ఆహారానికి కారణమయ్యే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేజీబీవీలు సహా అన్ని బాలికల పాఠశాలల్లో సీసీ కెమెరాలు పని చేసేలా చూడాలని, మరమ్మతులు ఉంటే తక్షణమే పూర్తి చేయించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో డీఆర్డీఓ సాయాగౌడ్, డీఈఓ అశోక్, ఆర్.సీ.ఓలు, ఇంజినీరింగ్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.


