ఈ నెల 9న చెరుకు రైతుల సన్నాహక సమావేశం
బోధన్ నియోజకవర్గ పరిధిలో మూతపడిన ఎన్సీఎస్ఎఫ్ సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీని పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు. ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం నిర్వహించిన రైతు సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతాంగానికి ఆర్థిక ధైర్యాన్ని, భరోసానిచ్చేది ఒక్క చెరుకు పంట మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. సారంగపూర్ ఫ్యాక్టరీని బెల్లం ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూ. 100 కోట్లు విడుదల చేయాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 9న సారంగపూర్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో చెరుకు రైతుల సన్నాహక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశానికి నియోజకవర్గ పరిధిలోని రైతులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆకుల పాపయ్య పిలుపునిచ్చారు.

