కుర్నాపల్లిలో వైభవంగా ప్రారంభమైన శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు
భక్తిశ్రద్ధలతో హోమాలు, గ్రామ ప్రదక్షిణ
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లి గ్రామంలో శ్రీ రేణుక మాత దేవస్థాన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. కుర్నాపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున 4:30 గంటల నుంచే సుప్రభాత సేవతో వేడుకలు మొదలయ్యాయి. అనంతరం గణపతి గౌరి పూజ, స్వస్తి పుణ్యహవచనం, గోమాత పూజ నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠాపన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. అమ్మవారి విగ్రహానికి భక్తిశ్రద్ధలతో గ్రామ ప్రదక్షిణ నిర్వహించారు. మంగళవాయిద్యాల నడుమ సాగిన ఈ ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 11 గంటలకు శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహానికి 'జలాదివాసము' నిర్వహించి, ఆవాహిత మండప పూజలు, హోమాలు చేశారు. సాయంత్రం తీర్థ ప్రసాద వితరణ చేపట్టారు.
ఈ ఉత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. శనివారం ధాన్యాది వాసము, ఫలాదివాస పూజలు నిర్వహించనున్నారు. అత్యంత ప్రధానమైన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఆదివారం ఉదయం 10:40 గంటలకు జరగనుంది. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

