ఏఆర్పీ క్యాంప్ బడి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
సెప్టెంబరు 6న వేడుకలు... హాజరుకావాలని పూర్వ విద్యార్థుల సంఘం పిలుపు
ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంప్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 65 సంవత్సరాల ఘనమైన ప్రయాణాన్ని పురస్కరించుకుని పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి సిద్ధమైంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు, పేద ఉద్యోగుల పిల్లలకు చదువు అందించే లక్ష్యంతో 1959లో ఈ పాఠశాలను నెలకొల్పారు. నాటి నుండి నేటి వరకు గ్రామీణ పేద విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఈ విద్యాలయం కీలక పాత్ర పోషించింది. 1994లో ఎయిడెడ్ పాఠశాలగా, 2001లో పూర్తిస్థాయి ప్రభుత్వ పాఠశాలగా మారిన ఈ బడిలో అత్యధికంగా 26 ఏళ్ల పాటు ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా సేవలందించిన స్వర్గీయ మద్దూరి అన్నపూర్ణయ్యతో పాటు వెంకటేశ్వరరావు, ప్రసాద్రావు వంటి పలువురు ఉపాధ్యాయులు క్రమశిక్షణతో కూడిన విద్యనందించారు. బ్రాహ్మణపల్లి, వడ్డేపల్లి, జైతాపూర్, కందకుర్తి తదితర పరిసర గ్రామాల పేద విద్యార్థులకు అక్షర వెలుగులు పంచిన ఈ పాఠశాల ప్రాంగణం సమ్మేళనంతో కోలాహలంగా మారనుంది. వచ్చే సెప్టెంబరు 6న ఆదివారం ఉదయం 10 గంటలకు పాఠశాల ప్రాంగణంలో ఈ ఆత్మీయ కలయిక ప్రారంభం కానుంది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం బ్యాచ్ల వారీగా గ్రూప్ ఫోటోలు, చిన్ననాటి జ్ఞాపకాల నెమరువేత కార్యక్రమాలు ఉంటాయి. ఈ అపూర్వ వేడుకకు పూర్వ విద్యార్థులంతా ఏ పనులున్నా వాయిదా వేసుకుని తరలివచ్చి జయప్రదం చేయాలని పూర్వ విద్యార్థుల సంఘం కోరింది.

