హైదరాబాద్.. ప్రపంచ జీవవైజ్ఞానిక కేంద్రం కావాలి
బయోఏషియా-2026 వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపు
తెలంగాణ వృద్ధిలో భాగస్వాములు కావాలని పారిశ్రామిక దిగ్గజాలకు విజ్ఞప్తి
తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ జీవవైజ్ఞానిక (లైఫ్ సైన్సెస్) రంగానికి చిరునామాగా మార్చేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్లోని హైటెక్స్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభమైన 23వ బయోఏషియా-2026 అంతర్జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించిన అనంతరం, రాష్ట్ర పారిశ్రామిక విజన్ను ప్రపంచ ప్రతినిధుల ముందు ఆవిష్కరించారు.
తెలంగాణ పోటీ దేశంలోని ఇతర రాష్ట్రాలతో కాదు.. ప్రపంచంలోని అగ్రగామి పారిశ్రామిక క్లస్టర్లతోనే అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే 'వ్యాక్సిన్ రాజధాని'గా పేరుగాంచిన హైదరాబాద్, ఇప్పుడు ఏఐ (AI), ఆటోమేషన్, బయోసైన్స్ కలయికతో సరికొత్త విప్లవానికి వేదిక కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ అంటే కేవలం ఒక రాష్ట్రం కాదని, అదొక నిరంతర వృద్ధికి సంకేతమని వ్యాఖ్యానించారు. బల్క్ డ్రగ్స్ నుంచి బయాలజిక్స్ వరకు, తయారీ నుంచి పరిశోధనల వరకు హైదరాబాద్ అత్యంత అనువైన ప్రాంతమని, జినోమ్ వ్యాలీ విస్తరణే ఇందుకు నిదర్శనమని తెలిపారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యంగా 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్ను రూపొందించామన్నారు. గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలో రూ. 73 వేల కోట్ల పెట్టుబడులు రావడం పారిశ్రామిక వాతావరణంపై ఉన్న నమ్మకానికి సాక్ష్యమని వివరించారు. పరిశోధన సంస్థలు, ప్రభుత్వం, స్టార్టప్ల మధ్య బలమైన భాగస్వామ్యం ఉండాలని, నైపుణ్యం కలిగిన రాష్ట్ర యువత ఈ విజయంలో కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
అవార్డు ప్రదానం.. వైద్య రంగంలో విశేష కృషి చేసిన పెన్సిల్వేనియా యూనివర్సిటీ ప్రొఫెసర్ బ్రూస్ ఎల్ లెవిన్కు ముఖ్యమంత్రి చేతుల మీదుగా 'జినోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు-2026ను అందజేశారు. దాదాపు 500 అంతర్జాతీయ సంస్థలు, 4 వేల మంది ప్రతినిధులు పాల్గొంటున్న ఈ సదస్సు, హైదరాబాద్ ప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయిలో మరోసారి చాటిచెప్పింది.


