గ్యాస్ ఏజెన్సీ నిర్లక్ష్యం.. ఎండలో వినియోగదారుల పడిగాపులు
బోధన్ పట్టణంలోని గోశాల వద్ద గురువారం వంట గ్యాస్ సరఫరాలో చోటుచేసుకున్న గందరగోళం వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. గ్యాస్ సిలిండర్ల కోసం ఉదయం నుంచే వందలాది మంది ప్రజలు ఖాళీ సిలిండర్ల తో క్యూ కట్టారు. గ్యాస్ వాహనం సకాలంలో రాకపోవడంతో దాదాపు మూడు గంటల పాటు ఎండలోనే వేచి చూడాల్సి వచ్చింది. ఏజెన్సీ నిర్వాహకుల వైఖరిపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్థానికుల ఆందోళన గమనించిన బిఆర్ఎస్ నాయకులు ముషీర్ బాబా, గుమ్ముల అశోక్రెడ్డి వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న వారు గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడి నిలదీశారు. ఏజెన్సీ బాధ్యతారాహిత్యం వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పట్టణ సీఐ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ సందర్భంగా సీఐ వెంకట నారాయణ మాట్లాడుతూ.. గ్యాస్ కొరత ఏమీ లేదని, వినియోగదారులకు అవసరమైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఏజెన్సీదేనని స్పష్టం చేశారు. ఇకపై గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారులందరికీ నేరుగా వారి ఇళ్లకే సిలిండర్లు సరఫరా చేయాలని ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశించారు. ఎండలో ఇబ్బంది పడుతున్న ప్రజలను గమనించిన నాయకులు ముషీర్ బాబా, అశోక్రెడ్డి వెంటనే తాత్కాలికంగా టెంట్ను ఏర్పాటు చేయించి, తాగునీటి సౌకర్యం కల్పించారు. దీంతో వినియోగదారులు కొంత ఉపశమనం పొందారు. కష్ట సమయంలో తమకు అండగా నిలిచిన కౌన్సిలర్లకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.


