కవిత ఆరోపణలు దొంగే దొంగ అన్నట్లున్నాయి: బీజేపీ
అభివృద్ధిపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదు
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు దొంగే దొంగ అన్నట్లు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి, కార్పొరేషన్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దంపల్లి జ్యోతి విమర్శించారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కేసీఆర్ పాలనలో నిజామాబాద్లో మాధవ్నగర్ ఆర్ఓబీ నిర్మాణానికి నిధులు ఇవ్వకుండా ఏళ్ల తరబడి జాప్యం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్న చరిత్ర బీఆర్ఎస్దని ఆరోపించారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ శ్రమతో అమృత భారత్ కింద జిల్లా రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, పలు ఆర్ఓబీ, ఆర్యూబీల నిర్మాణాలు జరిగాయని, కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు వచ్చాయని గుర్తుచేశారు. ఇవన్నీ కళ్లకు కనిపిస్తున్నా నిధులు రాలేదనడం అబద్ధమన్నారు. పసుపు రైతుల కల నెరవేరుతుంటే రాజకీయాలు చేయడం సరికాదన్నారు. అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్లోనే కవిత నిరసన నాటకాలు ఆడుతున్నారని, ఎంపీపై అసత్య ఆరోపణలు చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు ప్రసన్న రెడ్డి, సుమిత్ర దేవి, వైష్ణవి, అర్చన, మహిళా మోర్చా నాయకులు వనిత, వరలక్ష్మి పాల్గొన్నారు.

