పాఠశాలల మధ్య విద్యా భాగస్వామ్యం పెరగాలి
సాలూర జడ్పీహెచ్ఎస్లో ‘స్కూల్ ట్విన్నింగ్’ కార్యక్రమం
గ్రామీణ మరియు పట్టణ ప్రాంత పాఠశాలల మధ్య ఉపాధ్యాయ, విద్యార్థుల బోధనా నైపుణ్యాలను పంచుకోవడానికి ‘స్కూల్ ట్విన్నింగ్’ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని వక్తలు పేర్కొన్నారు. మంగళవారం సాలూర పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాపనయ్య నగర్ ఎంపీపీఎస్ విద్యార్థుల సందర్శన కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు పురానే విజయ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థుల మధ్య యోగా, ఆటలు, బోధన విషయాల్లో భాగస్వామ్యాన్ని పెంచడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. తొలుత విద్యార్థులకు ఆధునిక ఐఎఫ్పీ ప్యానెల్ ద్వారా ‘మోటివేషన్ సెషన్’ నిర్వహించి వారిలో స్ఫూర్తిని నింపారు. బాపనయ్య నగర్ పాఠశాల విద్యార్థులు ఉన్నత పాఠశాలలోని సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, కిచెన్ గార్డెన్ తరగతి గదులను ఆసక్తిగా పరిశీలించారు. జీవశాస్త్రానికి సంబంధించిన మోడల్స్, స్పెసిమెన్లను ఉపాధ్యాయులు విద్యార్థులకు చూపిస్తూ వివరించారు. అనంతరం సాలూర జడ్పీహెచ్ఎస్ విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు సభికులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో బాపనయ్య నగర్ ఉపాధ్యాయులు పావని, సంధ్య, రాజేష్లతో పాటు సాలూర పాఠశాల ఉపాధ్యాయులు శోభారాణి, జ్యోత్స్న, అరుణ్ కుమార్, గంధం సాయిలు, పి.డి సంగీత్రావు, లక్ష్మి, స్వామి, రాజ్ కుమార్, అబ్బయ్య, విజయలక్ష్మి, సుధారాణి, విఠల్ కాంబ్లే, అంజన, మేడి రవి, వనజ, సాయిలు, విద్యార్థులు పాల్గొన్నారు.


