ఇన్స్పైర్ అవార్డ్ నామినేషన్లు పూర్తి చేయాలి: డీఈఓ పి.అశోక్
అన్ని యాజమాన్యాల పాఠశాలలు ఇన్స్పైర్ అవార్డ్స్ నామినేషన్లను తప్పనిసరిగా పూర్తి చేయాలని నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి పి.అశోక్ ఆదేశించారు. బోధన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రైవేటు పాఠశాలల ప్రిన్సిపాళ్లు, సైన్స్ ఉపాధ్యాయులకు ఇన్స్పైర్ అవార్డులు, ఎకో క్లబ్స్, ‘ఏక్ పేడ్ మా కే నామ్’, ఎన్ఎస్పీసీ, ఎస్హెచ్వీఆర్ తదితర అంశాలపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి నాగయ్య అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి పాఠశాల నుంచి కనీసం ఐదు ఇన్స్పైర్ నామినేషన్లు నమోదు చేయాలని, విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానం, సృజనాత్మకత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేలా కార్యక్రమాలు చేపట్టాలని డీఈఓ సూచించారు. అనంతరం జిల్లా సైన్స్ అధికారి కె. గంగా కిషన్ నామినేషన్ల ప్రక్రియ, వివిధ సైన్స్ కార్యక్రమాల నిర్వహణపై సమగ్ర అవగాహన కల్పించారు. ఆగస్టు 31వ తేదీలోపు నామినేషన్లతో పాటు ఎకో క్లబ్ నమోదు, నోటిఫికేషన్లు పూర్తి చేయాలని ఎంఈఓ నాగయ్య స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు, సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

