ఇసుక అక్రమార్కులపై కలెక్టర్ ఉక్కుపాదం
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
సాలూర తహసీల్దార్కు షోకాజ్ నోటీసు జారీ
జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై యంత్రాంగం నిఘా ముమ్మరం చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను ఏమాత్రం సహించేది లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇసుక అక్రమార్కుల పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.
ఆన్లైన్ ద్వారానే రవాణా :
జిల్లాలో ఇసుక రవాణా అంతా తప్పనిసరిగా 'మన ఇసుక వాహనం' (ఆన్లైన్) బుకింగ్ విధానం ద్వారానే జరగాలని కలెక్టర్ తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫ్లైన్ వే-బిల్లులు లేదా మాన్యువల్ అనుమతులు ఇవ్వకూడదని తహసీల్దార్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆన్లైన్ పర్మిట్ లేకుండా రోడ్డుపైకి వచ్చే ఇసుక వాహనాలను తక్షణమే సీజ్ చేసి, చట్టపరమైన కేసులు నమోదు చేయాలని సూచించారు.
నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు :
ఇటీవల సాలూర మండలంలో రెండు అక్రమ ఇసుక వాహనాలు పట్టుబడిన ఘటనను కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత తహసీల్దార్కు షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ కోరారు. అక్రమ రవాణాకు సహకరించే అధికారులను, సిబ్బందిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. అక్రమ రవాణా కట్టడికి ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేయాలని కలెక్టర్ వెల్లడించారు. ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత తహసీల్దార్లు, పోలీసు అధికారులు తక్షణమే బాధ్యులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ కరాఖండిగా హెచ్చరించారు.

