ఇమ్మడి గోపి ముదిరాజ్ హత్య పిరికిపంద చర్య
ముదిరాజ్ సామాజిక వర్గ రాజకీయ చైతన్యంలో కీలక పాత్ర పోషిస్తున్న ఇమ్మడి గోపి ముదిరాజ్ హత్యకు గురికావడం అత్యంత దారుణమని, ఇది పిరికిపంద చర్య అని నిజామాబాద్ జిల్లా యువజన విభాగం నాయకుడు సున్నపు ఓంకార్ తీవ్రంగా ఖండించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ముదిరాజ్ సంఘం బలోపేతానికి గోపి ముదిరాజ్ విశేష కృషి చేశారని ఓంకార్ గుర్తు చేశారు. మండల పరిషత్ అధ్యక్షుడిగా ప్రజలతో మమేకమై, అన్ని వర్గాల అభివృద్ధికి పాటుపడిన నాయకుడిని కోల్పోవడం సమాజానికి తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముదిరాజులను ఎల్లప్పుడూ ఆదుకునే నాయకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉందన్నారు. ఈ హత్యకు పాల్పడిన నిందితులను తక్షణమే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని సున్నపు ఓంకార్ డిమాండ్ చేశారు. ఘటనకు కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని ఆయన కోరారు. ఇమ్మడి గోపి ముదిరాజ్ ఆశయాలను కొనసాగిస్తామని, దోషులను శిక్షించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.

