అభాగ్యురాలిపై అఘాయిత్యం అమానుషం : విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ
- నిందితుడు ఇంతియాజ్ను తక్షణమే అరెస్టు చేయాలి
- బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆపం
మానసిక వికలాంగురాలైన యువతిపై ఆటో డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడటం సభ్య సమాజం తలదించుకోవాల్సిన విషయమని విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ తీవ్రంగా ఖండించారు. ఈ నెల 16న సాయంత్రం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని ఒక గ్రామంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆమె బోధన్ సీఐ విజయ్ బాబు, ఎస్సై మచ్చేందర్ రెడ్డిలను కలిశారు. ఈ సందర్భంగా సుజాత సూర్యవంశీ మాట్లాడుతూ.. రక్షణగా ఉండాల్సిన ఆటో డ్రైవర్ ఇంతియాజ్ ఒంటరిగా ఉన్న వికలాంగురాలిని బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని గ్రామ శివారుకు తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. నిందితుడిపై కేవలం అత్యాచారం కేసు మాత్రమే కాకుండా వికలాంగుల రక్షణ చట్టం మరియు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కఠినమైన సెక్షన్లు నమోదు చేయాలని పోలీసులను కోరారు.
కొంతమంది మైనార్టీ నాయకులు రాజకీయ పలుకుబడితో ఈ కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అటువంటి ప్రయత్నాలను తాము సహించబోమని ఆమె స్పష్టం చేశారు. పోలీస్ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని, నిందితుడిని కాపాడే ప్రయత్నం చేయకుండా తక్షణమే అరెస్టు చేసి బాధితురాలి కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. బాధితురాలికి న్యాయం జరగని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని ఆమె హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి లసింగారి భూమయ్య మాదిగ, బీజేపీ మండల అధ్యక్షులు పసులోటి గోపి కిషన్, ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు తాడం అబ్బాయ మాదిగ, భారతీయ ఎరుకల కులవృత్తుల సంఘం అధ్యక్షులు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొని సుజాత సూర్యవంశీ డిమాండ్కు మద్దతు తెలిపారు.

