అసెంబ్లీలో ఆశా వర్కర్ల సమస్యలను లేవనెత్తాలి
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్ల సమస్యలపై చర్చించాలని కోరుతూ సిఐటియు నాయకులు గురువారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. ఆశా వర్కర్లు క్షేత్రస్థాయిలో ప్రజారోగ్యానికి అందిస్తున్న సేవలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ఆశా వర్కర్లకు రూ. 18,000 కనీస వేతనం చెల్లించాలని, పెండింగ్లో ఉన్న మూడు నెలల బకాయి వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. వీటితో పాటు ఇతర సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎమ్మెల్యేను కోరారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, అసెంబ్లీలో ఆశా వర్కర్ల వేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, ఆశా వర్కర్ల సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

