నూతన ఇసుక విధానంపై ట్రాక్టర్ యజమానుల నిరసన
ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఇసుక విధానాన్ని వ్యతిరేకిస్తూ నిజామాబాద్ జిల్లా సాలూర మండలం మందర్న గ్రామంలో ట్రాక్టర్ యజమానులు శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మన ఇసుక వాహనం విధానం వల్ల స్థానిక వాహన యజమానులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, తక్షణమే ఈ నూతన విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతినే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సాలూర ఇన్ఛార్జ్ తహశీల్దార్ అనూషను కలిసి తమ ఆవేదనను విన్నవిస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. నూతన నిబంధనల వల్ల ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని తమ కుటుంబాలు రోడ్డున పడకముందే ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. స్పందించిన తహశీల్దార్ వారి సమస్యలను సావధానంగా విని, ఈ అంశాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎస్సై మచ్చేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మన ఇసుక వాహనం యాప్ పట్ల అవగాహన పెంచుకుని, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇసుకను యాప్ ద్వారా బుక్కింగ్ చేసుకోవాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

