మద్యం మత్తులో ఉన్మాదం.. కన్నతల్లి సజీవదహనం
కోటగిరిలో దారుణం.. నిప్పు పెట్టి చంపిన కిరాతక కొడుకు
మద్యం మహమ్మారి ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కన్నతల్లి అని కూడా చూడకుండా ఓ ఉన్మాది ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవదహనం చేశాడు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని బ్రాహ్మణగల్లికి చెందిన మానాజీ గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగొచ్చి ఇంట్లో గొడవ పడటం అతడికి అలవాటు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన మానాజీ, తన తల్లి భూమవ్వ (65) తో గొడవకు దిగాడు. వివాదం ముదరడంతో ఆగ్రహంతో ఊగిపోయిన అతడు.. ఇంట్లో ఉన్న పెట్రోల్ను తల్లిపై పోశాడు. అంతటితో ఆగక, ఆమెపై పాత బట్టలు వేసి నిప్పు అంటించాడు. మంటలు వేగంగా వ్యాపించడంతో భూమవ్వ ఆర్తనాదాలు చేస్తూ మంటల్లో చిక్కుకుపోయింది. వృద్ధురాలు కావడంతో తప్పించుకోలేక, సహాయం కోసం కేకలు వేసినా ఫలితం లేకపోయింది. క్షణాల్లోనే ఆమె కళ్లెదుటే కాలిబూడిదైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విచ్చలవిడిగా వెలుస్తున్న బెల్ట్ షాపులే ఇలాంటి ఘటనలకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి కన్నవారిని, కట్టుకున్నవారిని చంపడానికి కూడా వెనుకాడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు మానాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సునీల్ వెల్లడించారు.

