హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష .. రూ.5 వేల జరిమానా
- బోధన్ ఐదో అదనపు జిల్లా కోర్టు తీర్పు
హత్య, దొంగతనం కేసుల్లో నేరం రుజువు కావడంతో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించినట్లు బోధన్ ఐదో అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి డి.వరూధిని మంగళవారం సంచలన తీర్పు వెలువరించారు. పొతంగల్ మండలం జల్లపల్లి ఫారం గ్రామానికి చెందిన నేనావత్ రాములుపై కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య, దొంగతనం ఆరోపణలపై నమోదైన కేసులో విచారణ చేపట్టిన న్యాయమూర్తి బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 258(2) ప్రకారం రాములును దోషిగా నిర్ధారించారు. నిందితుడికి హత్య నేరానికి గాను యావజ్జీవ జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా, జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే దొంగతనం నేరానికిగాను మూడేళ్ల కఠిన జైలు శిక్ష, రూ.500 జరిమానా, జరిమానా చెల్లించని పక్షంలో మరో నెల సాధారణ జైలు శిక్ష విధించారు. ఈ రెండు శిక్షలు ఏకకాలంలో అమలు అవుతాయని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గంగారెడ్డి వాదనలు వినిపించగా, రుద్రూర్ సీఐ ఆర్.కృష్ణ కేసు దర్యాప్తు చేపట్టి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. కేసును సమర్థవంతంగా విచారించి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన కోటగిరి ఎస్ఐ జి.శ్రీనివాస్ యాదవ్, కోర్టు లైజన్ ఆఫీసర్లు టి.గోవింద్, ప్రభు చరణ్, సిడిఓ జయపాల్, సిఎంఎస్ భాస్కర్లతో పాటు పోలీసు అధికారులను పలువురు అభినందించారు.

