బాలికల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
ఎడపల్లి కేజీబీవీ, గురుకుల పాఠశాలలను తనిఖీ చేసిన కలెక్టర్
విద్యార్థినుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని, బాలికల ఆరోగ్య రక్షణ, నాణ్యమైన విద్యే లక్ష్యంగా యంత్రాంగం పనిచేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పిలుపునిచ్చారు. బుధవారం ఎడపల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం తో పాటు తెలంగాణ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలను ఆయన క్షేత్రస్థాయిలో అకస్మాత్తుగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణ అంతటా తిరిగి మౌలిక వసతులను క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్, నాణ్యమైన భోజనం అందించడంతో పాటు విద్యార్థినుల శారీరక, మానసిక వికాసానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. పాఠశాలలో సాంకేతిక లోపాలతో నిరుపయోగంగా మారిన ఆర్.ఓ. వాటర్ ప్లాంట్, సోలార్ వాటర్ హీటర్లను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయించి పునరుద్ధరించాలన్నారు. ఖాళీగా ఉన్న విశాలమైన స్థలాన్ని సర్వాంగ సుందరమైన క్రీడా ప్రాంగణంగా మార్చాలని సూచించారు. కేజీబీవీలో మిగిలిన సీట్ల భర్తీకై రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. గురుకుల కళాశాలలో విద్యార్థినులు స్వయంగా చేపట్టిన కూరగాయలు, వరి సాగును చూసి మురిసిపోయిన ఆయన నిర్వాహకుల శ్రమను విశేషంగా కొనియాడారు. అనంతరం 10వ తరగతి గదుల్లోకి వెళ్లిన కలెక్టర్, విద్యార్థినుల అభ్యసన నైపుణ్యాలను పరిశీలించి, ప్రశ్నలు వేసి సరైన సమాధానాలు చెప్పిన చిన్నారులకు బహుమతులు అందజేసి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దత్తాత్రి, ఎంఈఓ శివలింగ గాలప్ప తదితరులు పాల్గొన్నారు.


