ఓటరు జాబితా సవరణ పక్కాగా జరగాలి: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశం
అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో తప్పకుండా ఉండేలా క్షేత్రస్థాయి సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ నగరంలోని 19వ డివిజన్ కంటేశ్వర్లో బి.ఎల్.ఓ లు ఇంటింటికీ తిరిగి నోటీసులు అందజేస్తున్న తీరును ఆయన గురువారం స్వయంగా పరిశీలించారు.
2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ జరగని వారికి, పేరు లేదా వయస్సులో వ్యత్యాసాలున్న వారికి హియరింగ్ కోసం నోటీసులు ఇస్తున్న విధానాన్ని, సిబ్బంది పనితీరును కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. నోటీసు ఇచ్చే సమయంలోనే ఓటర్లు ధృవీకరణ పత్రాలు అందజేస్తే వాటిని స్వీకరించాలని, నిర్ణీత సమయానికి రాలేని వారికి మరోసారి నోటీసు ఇవ్వాలని సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటిస్తూ నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియను పక్కాగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.


