బోధన్లోని శ్రీ దక్షిణముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో 72 గంటల అఖండ రుద్రాభిషేకం
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బ్రాహ్మణ గల్లిలో గల శ్రీ దక్షిణముఖి ఆంజనేయ స్వామి ఆలయం ప్రస్తుతం భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సోమవారం ప్రారంభమైన 72 గంటల అఖండ రుద్రాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ఆలయం మొత్తం ఓం నమఃశివాయ నామస్మరణతో, వేద పండితుల మంత్రోచ్ఛారణలతో మార్మోగుతోంది. రుద్రపారాయణాలతో పాటు స్వామివారికి నిర్వహిస్తున్న ప్రత్యేక అభిషేకాలు, మహామంగళహారతులు భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులు మరియు ప్రజలు పాడిపంటలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని సంకల్పిస్తూ బోధన్ బ్రాహ్మణ సేవా సమాజ్ మరియు వీడీసీ పట్టణ అభివృద్ధి కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు నిరంతరాయంగా సాగే ఈ అఖండ రుద్రాభిషేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.


