నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: డిఎంహెచ్ఓ డాక్టర్ బి.రాజశ్రీ
నిజామాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ బి.రాజశ్రీ హెచ్చరించారు. వైద్య ఆరోగ్యశాఖలోని క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి, శనివారం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో పలు ఆసుపత్రుల్లో అనేక లోపాలను గుర్తించినట్లు వెల్లడించారు.
తనిఖీల్లో భాగంగా ఎస్ఎస్ బాలాజీ ఆసుపత్రిని పరిశీలించగా వాహనాలకు పార్కింగ్ స్థలం, రోగుల కోసం ర్యాంప్ లేకపోవడంతో పాటు అత్యవసర వార్డు, సరిపడా సీటింగ్ వసతి లేవని స్పష్టం చేశారు. అలాగే బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ సర్టిఫికెట్, రిజిస్ట్రేషన్ పత్రాన్ని రోగులకు కనిపించేలా ప్రదర్శించలేదని తెలిపారు. అయ్యప్ప ఆసుపత్రిలోనూ పార్కింగ్ సదుపాయం లేకపోవడం, బోర్డుపై రిజిస్ట్రేషన్ వివరాలు లేకపోవడం, ఫారమ్-ఎఫ్లో అసంపూర్తి సమాచారం ఉండటంతో పాటు బయో మెడికల్ వేస్ట్ సర్టిఫికెట్ లేకపోవడాన్ని తప్పుపట్టారు.
అదేవిధంగా బాంబే నర్సింగ్ హోమ్లో సేవల ధరల పట్టిక, అందించే ఆరోగ్య సేవల వివరాలు, రిజిస్ట్రేషన్ మరియు బయో మెడికల్ వేస్ట్ సర్టిఫికెట్లను ప్రదర్శించలేదని గుర్తించారు. తక్షణమే ఈ లోపాలన్నింటినీ సరిచేసుకొని చట్ట నిబంధనలకు అనుగుణంగా ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఆయా యాజమాన్యాలను ఆదేశించారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ విభాగం వైద్యులు డాక్టర్ సుప్రియ, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ కీర్తన మరియు డిహెచ్ఈ వేణుగోపాల్ పాల్గొన్నారు.


