గురుశిష్యుల ఆత్మీయ కలయిక.. చౌట్పల్లిలో పూర్వ విద్యార్థుల సందడి
అది వారు అక్షరాలు దిద్దిన ఆలయం.. క్రమశిక్షణ నేర్చుకున్న వేదిక. సరిగ్గా పాతికేళ్ల కిందట అదే పాఠశాల నుంచి పదో తరగతి పూర్తి చేసుకుని బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టారు. మళ్లీ ఇన్నాళ్లకు అదే ప్రాంగణంలో చిన్ననాటి స్నేహితులందరూ ఒకచోట చేరి సందడి చేశారు. కమ్మర్ పల్లి మండలంలోని చౌట్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 2000-2001 విద్యా సంవత్సరం (SSC) పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం పాఠశాల ఆవరణలో ఘనంగా జరిగింది. దశాబ్దాల క్రితం విడిపోయిన స్నేహితులందరూ ఒకే చోట చేరి తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
తమకు విద్యాబుద్ధులు నేర్పి, సమాజంలో ఉన్నత స్థానాల్లో నిలబెట్టిన నాటి ఉపాధ్యాయులను విద్యార్థులు భక్తిశ్రద్ధలతో గౌరవించుకున్నారు. ఉపాధ్యాయులను వేదికపైకి ఆహ్వానించి, పూలమాలలు వేసి, శాలువాలతో ఘనంగా సన్మానించి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ఒకప్పటి విద్యార్థులు ఇప్పుడు వివిధ వృత్తుల్లో స్థిరపడినప్పటికీ, తమ గురువుల ముందు మాత్రం మళ్లీ పాత విద్యార్థులుగానే మారిపోయి ఆశీస్సులు తీసుకోవడం విశేషం. ఈ కార్యక్రమంలో అప్పటి ఉపాధ్యాయులతో పాటు పూర్వ విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.


