శివనామస్మరణతో మార్మోగిన ఆత్మలింగేశ్వరం
బోధన్ పట్టణంలోని బైపాసు రోడ్డు పాండుచెరువు ఒడ్డున గల ప్రసిద్ధ శ్రీ ఆత్మలింగేశ్వరాలయం శ్రావణమాస రెండవ సోమవారాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది. ఆలయ కమిటీ అధ్యక్షుడు కొప్పాక శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను కన్నులపండువగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి, సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాభిషేకాలు, రుద్రాభిషేకాలు, విశేష బిల్వార్చనలు ఘనంగా జరిగాయి. హరహర మహాదేవ.. శంభో శంకర నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగింది. భక్తులు దీపారాధనలు చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణ మాసంలో పరమశివుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం ద్వారా కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధకాగలవని అర్చకులు పేర్కొన్నారు.


