పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలి
రూపారెడ్డి దారుణ హత్యపై ‘టీఆర్ఎస్ఎంఏ’ నిరసన
నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
నల్గొండ జిల్లా ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్ రూపారెడ్డి దారుణ హత్యను నిజామాబాద్ జిల్లా తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం తీవ్రంగా ఖండించింది. విద్యాసంస్థలు నిర్వహిస్తూ సమాజానికి సేవ చేస్తున్న మహిళా కరస్పాండెంట్పై ఇలాంటి దాడి జరగడం విద్యా రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొంటూ జిల్లా యంత్రాంగానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ఎంఏ జిల్లా అధ్యక్షుడు నిత్యానందం మాట్లాడుతూ.. విద్యారంగంలో పనిచేస్తున్న పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు మరియు సిబ్బంది రక్షణకు ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రూపారెడ్డి హత్య కేసును అత్యంత ప్రాధాన్యతతో వేగవంతంగా దర్యాప్తు చేసి, బాధ్యులందరినీ కఠినంగా శిక్షించాలని కోరారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. పాఠశాలల వద్ద పోలీసు పర్యవేక్షణ పెంచాలని, యాజమాన్యాలు మరియు సిబ్బందిపై వేధింపులు, బెదిరింపులు జరిగినప్పుడు తక్షణమే స్పందించేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక పోలీసు నోడల్ అధికారిని నియమించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రైవేట్ పాఠశాలల భద్రతపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ఎంఏ రాష్ట్ర కోశాధికారి జయసింహ గౌడ్, జిల్లా కార్యదర్శి అరుణ్, జిల్లా కోశాధికారి ఉప్పల మధు, సంఘం ప్రతినిధులు నరసింహారావు, మోహన్, జనార్ధన్, పృథ్వి, పాఠశాల శ్రీనివాస్, నాగరాజు, రమేష్, ప్రభాదేవి, కవిత, ధర్మరాజు, ఇతర కరస్పాండెంట్లు, ట్రస్మా నాయకులు పాల్గొన్నారు.

