భీంగల్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణంలో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామని, ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పేర్కొన్నారు. పట్టణంలోని 3వ వార్డు, దేవి ఆలయం సమీపంలో ఎంతో కాలంగా అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శుక్రవారం శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ ప్రాంతంలో రోడ్డు లేకపోవడంతో వర్షాకాలంలో బురదమయమై, నిత్యం రాకపోకలకు స్థానికులు, పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. నడవలేని పరిస్థితి ఉన్న ఈ మార్గంలో సీసీ రోడ్డు నిర్మించాలని గత కొంతకాలంగా స్థానికులు కోరుతున్నారు. ప్రజల సమస్యను గుర్తించిన ముత్యాల సునీల్ కుమార్, సంబంధిత అధికారులతో మాట్లాడి నిధుల మంజూరుకు ప్రత్యేక చొరవ చూపారు. దీంతో పనులు ప్రారంభం కావడంతో స్థానిక ప్రజలు, నంది గల్లి పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి వీధి, ప్రతి కాలనీ అభివృద్ధి చెందాలనే సంకల్పంతో తాము పని చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా ప్రజల అవసరాలకు పెద్దపీట వేస్తామన్నారు. పనుల్లో నాణ్యత పాటించాలని, నిర్ణీత సమయంలోగా రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ బొద్దురే నాగమణి స్వామి, వైస్ ఛైర్మన్ జేజేలత, జేజే నర్సయ్య, 3వ వార్డు కౌన్సిలర్ తోటా సతీష్, 2వ వార్డు కౌన్సిలర్ పర్సా అనంతరావు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు నల్లూరి గంగమణి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వార్డు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

