బషీరాబాద్లో మత్తు పదార్థాలపై ఉక్కుపాదం
నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా..
బషీరాబాద్ (వెంకటాపురం) గ్రామ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సర్పంచ్ బైకని జమున మహేష్ నేతృత్వంలోని గ్రామ పంచాయతీ పాలకవర్గం అత్యంత కఠినమైన నిబంధనలను అమలులోకి తెచ్చింది. గ్రామంలో క్రమశిక్షణను పెంచడంతో పాటు వ్యసనాల బారిన పడకుండా యువతను కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు. 20 సంవత్సరాల లోపు వయసున్న వారికి సిగరెట్లు, పాన్, గుట్కా వంటివి విక్రయించడాన్ని పూర్తిగా నిషేధించారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలు అతిక్రమించి మత్తు పదార్థాలు విక్రయిస్తే వారికి 10 వేల రూపాయల వరకు భారీ జరిమానా విధిస్తామని పాలకవర్గం హెచ్చరించింది.
మరోవైపు గంజాయి వంటి ప్రాణాంతక పదార్థాల విషయంలో పంచాయతీ మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. గంజాయి అమ్మినా లేదా కొనుగోలు చేసినా 20 వేల రూపాయల జరిమానాతో పాటు కఠిన జైలు శిక్ష కూడా ఉంటుందని స్పష్టం చేసింది. కేవలం వ్యసనాలే కాకుండా రహదారి భద్రతపై కూడా పాలకవర్గం ప్రత్యేక దృష్టి సారించింది. గ్రామంలో యువకులు బైక్లను అతివేగంగా నడిపితే జరిమానాలు తప్పవని, ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆదేశించింది. గ్రామ శ్రేయస్సు కోరి తీసుకున్న ఈ నిర్ణయాలకు ప్రజలందరూ సహకరించాలని బషీరాబాద్ పంచాయతీ పాలకవర్గం విజ్ఞప్తి చేసింది.

