సార్వజనిక్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా పూజారి లింగం
బోధన్ పట్టణంలో 2026-27 సంవత్సరానికి గాను సార్వజనిక్ గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నూతన ఉత్సవ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక శ్రీ ఏకచక్రేశ్వర శివాలయ ప్రాంగణంలో గ్రామ ప్రముఖుల ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షుడిగా పూజారి లింగం, ప్రధాన కార్యదర్శిగా సందీప్, కోశాధికారిగా నంద్యాల శ్యామ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ... గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని తెలిపారు. సెప్టెంబర్ 14న సోమవారం శివాలయంలో సార్వజనిక్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ ఉత్సవాల్లో ప్రజలు, భక్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

