వదంతులు నమ్మొద్దు.. ఇంధనానికి కొరత లేదు : సీపీ సాయి చైతన్య
తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు
నిజామాబాద్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మి ప్రజలు ఇబ్బందులు పడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
బంకుల వద్ద అనవసర రద్దీ..
కొరత ఉందన్న ప్రచారంతో వాహనదారులు ఒకేసారి పెద్ద సంఖ్యలో బంకులకు చేరుకుంటున్నారని, దీనివల్ల అనవసరమైన రద్దీ ఏర్పడి సామాన్య ప్రజలకు అంతరాయం కలుగుతోందని సీపీ పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా నిల్వలు ఉన్నాయని, సరఫరా కూడా నిరంతరంగా కొనసాగుతోందని వివరించారు. ప్రజలు తమ అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని సూచించారు.
అప్రమత్తంగా ఉండాలి..
నిర్ధారించని సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి గందరగోళం సృష్టించవద్దని ఆయన కోరారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. ఎవరైనా వదంతులు వ్యాప్తి చేసినా లేదా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే చర్యలకు పాల్పడినా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సాయిచైతన్య హెచ్చరించారు.

