యూరియా ఇప్పించాలని ఆర్డీవోకు రైతుల వినతి
ఫార్మర్ ఫర్టిలైజర్ యాప్లో వస్తున్న సాంకేతిక సమస్యల వల్ల తమకు యూరియా అందడం లేదని, సొసైటీ ద్వారా మ్యాన్యువల్గా పంపిణీ చేయించాలని కోరుతూ బోధన్ కు చెందిన రైతులు సోమవారం రెవెన్యూ డివిజినల్ అధికారిణి విజయ కుమారిని కలసి వినతిపత్రం సమర్పించారు. బోధన్ పట్టణంలోని దుద్యాల్, దౌత్యాల్, పాండు, బెల్లాల్, చెక్కి తర్పాలు గ్రామాల పేర్లు యాప్లో చూపించకపోవడంతో సొసైటీలో స్టాక్ ఉన్నప్పటికీ సిబ్బంది ఎరువులు ఇవ్వడం లేదని చిన్న, సన్నకారు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు యూరియా అత్యంత అవసరమైన తరుణంలో యాప్ సమస్య కారణంగా సరఫరా నిలిచిపోవడం దారుణమని పేర్కొన్నారు. వ్యవసాయ అధికారులను సంప్రదించినా ఫలితం లేకపోయిందని, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సాంకేతిక లోపాన్ని సరిచేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు పట్టాదారు పాసుబుక్కుల ఆధారంగా మ్యాన్యువల్గా యూరియా బస్తాలు ఇప్పించి ఆదుకోవాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
.jpeg)

