గంజాయిపై ఉక్కుపాదం మోపాలి: మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమేర్
మత్తు కోరల్లో చిక్కి.. భవిష్యత్తును చిదిమేసుకోవద్దు
గంజాయి నషాలో పడి యువత తమ ఉజ్వల భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమర్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం బోధన్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజానికి వెన్నెముక లాంటి యువత మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవడం విచారకరమని పేర్కొన్నారు. గంజాయి మహమ్మారి యువతను శారీరకంగా, మానసిక దృఢత్వాన్ని కోల్పోయేలా చేస్తోందని, తద్వారా వారు నేర ప్రవృత్తి వైపు మళ్లుతున్నారని హెచ్చరించారు.
పోలీసులు ప్రత్యేక చొరవ చూపాలి
పట్టణంలోని పలు ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయని, దీనిని అరికట్టేందుకు జిల్లా, బోధన్ పోలీసు అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని షకీల్ ఆమేర్ కోరారు. పోలీసులు నిరంతరం నిఘా ఉంచి, విక్రయదారులు మరియు సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యాసంస్థల పరిసరాల్లో గంజాయి లభ్యం కాకుండా ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టాలని సూచించారు. గంజాయి రహిత బోధన్ను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలని పిలుపునిచ్చారు. యువత మత్తుకు దూరంగా ఉండి, చదువుపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.

