హిందూ సమాజం సమైక్యం కావాలి
సాలూరలో ‘హిందూ సమ్మేళనం’ కరపత్రాల ఆవిష్కరణ
ఏప్రిల్ 5న సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం
హిందూ ధర్మ పరిరక్షణే లక్ష్యంగా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది ఉత్సవాల వేళ హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని నిజామాబాద్ జిల్లాలో సాలూర మండల హిందూ సమ్మేళనం అధ్యక్షులు ముట్టెన్ ప్రకాశ్ పిలుపునిచ్చారు. శుక్రవారం సాలూర మండల కేంద్రంలోని పురాతన ఒంటి హనుమాన్ మందిరం వద్ద వచ్చే నెల 5న నిర్వహించ తలపెట్టిన ‘హిందూ సమ్మేళనం’ కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ముట్టెన్ ప్రకాశ్ మాట్లాడుతూ.. భారతదేశానికి ఆత్మ వంటిదైన హిందూ సంస్కృతిని, ధర్మాన్ని కాపాడుకోవడం ప్రతి హిందూ బంధువు బాధ్యత అని పేర్కొన్నారు. సంఘ ప్రయాణంలో వంద ఏళ్ల సఫల కార్యాన్ని సింహావలోకనం చేసుకుంటూ, భవిష్యత్ సాధనా మార్గాన్ని దర్శించేందుకు ఈ సమ్మేళనం వేదిక కానుందని తెలిపారు. కులాలు, ప్రాంతాలు, పార్టీలు ఏవైనా.. ‘మనమంతా హిందువులం’ అనే భావనతో జీవించినప్పుడే ధర్మాన్ని, ఆలయాలను, ఆడబిడ్డలను రక్షించుకోగలమని ఉద్ఘాటించారు.
భారీగా తరలిరావాలి
వచ్చే నెల 5వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు సాలూర బస్టాండ్ సమీపంలోని రైస్ మిల్ ఆవరణలో జరిగే ఈ సమ్మేళనానికి హున్సా, మంధర్న, ఖాజాపూర్, తగ్గెల్లి తదితర గ్రామాల నుంచి హిందూ బంధువులు కుటుంబ సమేతంగా తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, భక్తులందరూ పాల్గొని హిందూ ఐక్యతను చాటాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శివకాంత్ పటేల్, వడ్ల దత్తు, మిద్దెల రాజు, లోకప్పగారి లక్ష్మణ్, కండెల సంజీవ్ కుమార్, రత్నెల్లి లింగయ్య, స్వామి గౌడ్, భాస్కర్, ముస్త్యాల దత్తాత్రి, గంగయ్య హిందూ సమాజ కార్యకర్తలు పాల్గొన్నారు.


