బీఆర్ఎస్ పనులకే కొబ్బరికాయలు కొడుతున్నారు : బోధన్లో కాంగ్రెస్పై షకీల్ ధ్వజం
- రేపు బోధన్ ధర్నా చౌక్ వద్ద బీఆర్ఎస్ నిరసన
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు దాటినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, బోధన్ నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమేర్ ఆరోపించారు. మంగళవారం బోధన్లోని తన స్వగృహంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వైఫల్యాలను, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఆయన ఎండగట్టారు. పక్క నియోజకవర్గాలైన నిజామాబాద్కు ₹40 కోట్లు, ఆర్మూర్కు ₹20 కోట్ల చొప్పున అభివృద్ధి నిధులు కేటాయించినప్పటికీ, బోధన్కు మాత్రం ప్రభుత్వం నుంచి తగిన నిధులు రాలేదని షకీల్ ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకే స్థానిక ప్రజాప్రతినిధులు కొబ్బరికాయలు కొడుతూ కాలయాపన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బోధన్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ లోపించిందని, చెత్త సేకరణ క్రమబద్ధంగా జరగకపోవడంతో రోడ్లు, డ్రైనేజీలు అధ్వానంగా తయారై పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పట్టణంలోని దాదాపు 3,500 ఇళ్లను 22A (నిషేధిత భూముల) జాబితాలో చేర్చడం వల్ల పేద ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, ఆ జాబితా నుంచి పేర్లు తొలగించే పేరుతో స్థానికంగా అక్రమ వసూళ్లు, వేధింపులు జరుగుతున్నాయని షకీల్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడుతూ.. యూరియా సరఫరాలో యంత్రాంగం విఫలమైందని, ఆన్లైన్ పోర్టళ్లు సరిగా పనిచేయక రైతులు అల్లలాడుతున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో జాప్యం కారణంగా పంట దెబ్బతింటుందనే భయంతో రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోతున్నారని తెలిపారు. ఇటీవల ఊసా మార్డర్న తదితర గ్రామాల్లో వడగండ్ల వానకు పంటలు దెబ్బతిన్నా బాధితులకు తగిన సహాయం అందలేదని విమర్శించారు. పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటూ ప్రతిపక్ష శ్రేణులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో అధికారంలోకి రాగానే ప్రతి అంశంపైనా విచారణ జరిపి అక్రమాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ, వారు బకాయి పడ్డ హామీల వివరాలతో కూడిన 'బాకీ కార్డుల'ను ప్రదర్శిస్తూ బుధవారం ఉదయం 10 గంటలకు బోధన్ ధర్నా చౌక్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించారు. అనంతరం ప్రతి గ్రామం, వార్డు స్థాయిలో నిరసన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. కాంగ్రెస్ అరాచకాలపై బీఆర్ఎస్ శ్రేణులు ధైర్యంగా పోరాడాలని, ఈ ధర్నా కార్యక్రమానికి రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గంగారెడ్డి, పట్టణ, మండలాల అధ్యక్షులు రవీందర్ యాదవ్, సంజీవ్, నర్సన్న, శ్రీరామ్, నర్సింగ్ రావు, భూమారెడ్డి, కౌన్సిలర్లు ముషీర్ బాబా, అశోక్ రెడ్డి, మోబీన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

