కుమ్మన్ పల్లిలో ఘనంగా హోలీ సంబరాలు : హోరాహోరీగా కుస్తీ పోటీలు
నిజామాబాద్ జిల్లా సాలూర మండలం కుమ్మన్ పల్లి గ్రామంలో హోలీ పండుగ వేడుకలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. గ్రామస్తులందరూ రంగులు చల్లుకుంటూ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ పండుగను పురస్కరించుకొని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుస్తీ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు తెలంగాణ మరియు మహారాష్ట్ర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో మల్లయోధులు తరలివచ్చారు. హోరాహోరీగా సాగిన ఈ కుస్తీల్లో మల్లయోధులు తమ బలాబలాలను ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు గ్రామ పెద్దలు నగదు పురస్కారాలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో రాజ్ పటేల్, గ్రామ సర్పంచ్ శీలం మహేందర్ రెడ్డి, విడిసి అధ్యక్షులు తోకల అంజయ్య, గ్రామ పెద్దలు రాహుల్ రెడ్డి, హనుమంత్ రెడ్డి మరియు గ్రామస్తులు పాల్గొని వేడుకలను జయప్రదం చేశారు.

