ఆర్గుల్ పంప్ హౌస్ వద్ద మిషన్ భగీరథ సిబ్బంది ధర్నా
తమకు రావాల్సిన ఎనిమిది నెలల వేతన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్గుల్ పంప్ హౌస్ వద్ద మిషన్ భగీరథ లైన్మెన్లు, పంప్ ఆపరేటర్లు గురువారం ఆందోళనకు దిగారు. గత ఎనిమిది నెలలుగా జీతాలు అందకపోవడంతో కుటుంబ పోషణ భారమైందని, అప్పులు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనలో భాగంగా జలాల్పూర్, బాల్కొండ ప్రాంతాలకు వెళ్లే పంపింగ్ను సిబ్బంది నిలిపివేయడంతో ఆయా గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది.
ఈ సందర్భంగా లైన్మెన్లు బట్టు స్వామి, శ్రవణ్, రాములు, ఉపేందర్ తదితరులు మాట్లాడుతూ.. రేయింబవళ్లు కష్టపడి ప్రజలకు తాగునీరు అందిస్తున్న తమపై ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడం తగదన్నారు. తక్షణమే పెండింగ్ నిధులు విడుదల చేసి తమను ఆదుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించే వరకు పంపింగ్ పునరుద్ధరించే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు.

