వంద శాతం పన్ను వసూళ్లే లక్ష్యం
బోధన్లో డివిజన్ స్థాయి సమీక్షా సమావేశం
అధికారులకు దిశానిర్దేశం చేసిన అదనపు కలెక్టర్ శ్రీనివాస్రావు
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు, పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఇంచార్జి అదనపు కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్రావు అధికారులను ఆదేశించారు. సోమవారం బోధన్ పట్టణంలోని లయన్స్ క్లబ్ భవనంలో వివిధ మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులతో ఆయన డివిజన్ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ అంశాలపై అధికారుల నుంచి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా మంజూరైన నిధులను ఎప్పటికప్పుడు గ్రామాల్లో అభివృద్ధి పనులకు వెచ్చించాలని, ఏ ఒక్క రూపాయి కూడా వృథా కాకుండా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని హెచ్చరించారు. డిమాండ్, కలెక్షన్, బ్యాలెన్స్ నివేదికలను పరిశీలించిన ఆయన, పన్ను వసూళ్లలో వెనుకబడిన మండలాలపై అసహనం వ్యక్తం చేశారు. నెలాఖరులోపు 100 శాతం పన్ను వసూళ్లను సాధించి, రికార్డులను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. లక్ష్యాలను చేరుకోని సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యక్రమం (ప్రజాపాలన) పురోగతిని ఆయన నిశితంగా సమీక్షించారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల పరిష్కారంలో అలసత్వం వద్దు. మండల స్థాయి అధికారులు ప్రతిరోజూ ఉదయం గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శులు హాజరు పట్టికను, రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని, నియోజకవర్గంలోని ఏ ఒక్క గ్రామంలోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తుగా సమ్మర్ యాక్షన్ ప్లాన్, కంటింజెన్సీ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. బోరుబావుల మరమ్మతులు, పైపులైన్ల లీకేజీలను తక్షణమే సరిచేయాలని చెప్పారు. ప్రతి ఇంటి వద్ద చెత్తను విధిగా వర్గీకరించి, స్వచ్ఛ గ్రామాలను తయారు చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో బోధన్ డివిజన్కు చెందిన మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

