పీసీపీఎన్డీటీ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి
జిల్లా సలహా సంఘం సమావేశంలో డిఎంహెచ్వో బి.రాజశ్రీ
అనుమతి లేకుండా స్కానింగ్ మిషన్ల తరలింపు నేరం
గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు నిషేధ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి.రాజశ్రీ హెచ్చరించారు. గురువారం డిఎంహెచ్వో కార్యాలయంలో ఆమె అధ్యక్షతన పిసిపిఎన్డిటి జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రాజశ్రీ మాట్లాడుతూ... చట్ట ప్రకారం నమోదు చేసుకున్న వైద్యులు మాత్రమే స్కానింగ్ మిషన్లను వినియోగించాలని స్పష్టం చేశారు. కొత్తగా మిషన్ కొనుగోలు చేయాలన్నా, లేదా ఉన్న మిషన్లను ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి బదలాయించాలన్నా ముందుగా జిల్లా వైద్యాధికారి కార్యాలయం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. నిబంధనలను అతిక్రమించి అనుమతి లేకుండా మిషన్లను తరలిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. స్కానింగ్ సమయంలో పుట్టబోయే శిశువు లింగాన్ని (అమ్మాయా, అబ్బాయా) వెల్లడించడం చట్టప్రకారం నేరమని ఆమె నొక్కి చెప్పారు. ఇలాంటి సమాచారం ఇచ్చి గర్భ విచ్ఛిత్తికి పాల్పడితే ఎంటిపి చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమాజంలో లింగ నిష్పత్తి పడిపోవడానికి ఇటువంటి అక్రమ పరీక్షలే కారణమని, అమ్మాయి, అబ్బాయి సమానమేనన్న భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శ్వేత (రేడియాలజిస్ట్), డాక్టర్ ఇందు (గైనకాలజిస్ట్), డాక్టర్ ప్రభావతి (చిల్డ్రన్ స్పెషలిస్ట్), ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సుప్రియ, డాక్టర్ శిఖర, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు ప్రేమలత, స్వచ్ఛంద సేవా సంఘం ప్రతినిధి పద్మాసింగ్, డిహెచ్ఇ వేణుగోపాల్, హెచ్ఇఓ సురేష్ పాల్గొన్నారు.

