అర్హులైన లబ్ధిదారులకు వెంటనే పింఛన్లు మంజూరు చేయాలి
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి అర్హులైన వృద్ధులు, బీడీ కార్మికులకు పింఛన్లు మంజూరు చేయకపోవడం తీవ్ర అన్యాయమని ఎడపల్లి సర్పంచ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కందగట్ల రాంచందర్ మండిపడ్డారు. ఎడపల్లి మండలంలోని అర్హులైన లబ్ధిదారులందరికీ తక్షణమే పింఛన్లు అందజేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీజేపీ నాయకులతో కలిసి ఎడపల్లి మండల అభివృద్ధి అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పింఛన్ల కోసం అర్హులైన అనేక మంది వృద్ధులు, బీడీ కార్మికులు ఆశగా ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్ మంజూరు చేయాలని, లేనిపక్షంలో బాధితుల తరఫున పోరాటాన్ని ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కోలా ఇంద్రకరణ్, జిల్లా మీడియా ఇన్చార్జి కూరెళ్ల శ్రీధర్, జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లెపూల శ్రీనివాస్, ప్యాట గంగాధర్, కంజరి ప్రదీప్ కుమార్, ద్యాకం సాయిరెడ్డి, కంజరి అభినవ్, బర్దిపూర్ విట్టల్, కట్కం శంకర్, అనిరుద్ గౌడ్, రాఘవేందర్, మార సాయి తదితరులు పాల్గొన్నారు.

