బాధ్యతాయుతమైన సేవలకు గుర్తింపు
సమాజ సేవలో నిరంతరం తపిస్తున్న వరంగల్ జిల్లాకు చెందిన ఎతరాజు నాగరాజుకు అరుదైన గౌరవం దక్కింది. నిస్వార్థంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు గాను, మంగళవారం హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆయనకు ప్రతిష్ఠాత్మక నంది అవార్డును ప్రదానం చేశారు. హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ దిశానిర్దేశంలో నాగరాజు సేవాపథంలో పయనిస్తున్నారు. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో అంబులెన్స్ సేవలు అందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇప్పటివరకు 32 సార్లు రక్తదానం చేసి, ఎంతోమంది ప్రాణాలను కాపాడటంలో తనవంతు కృషి చేశారు. క్రమశిక్షణతో కూడిన బాధ్యతాయుతమైన సేవలను గుర్తించిన కమిటీ ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. అవార్డు అందుకున్న అనంతరం నాగరాజు మాట్లాడుతూ... ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది. నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. భవిష్యత్తులో మరింత అంకితభావంతో సమాజ సేవ చేస్తానని ఉద్వేగంగా తెలిపారు. నాగరాజుకు ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ సభ్యులు, శ్రేయోభిలాషులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

