సేంద్రియ సాగుతోనే ఆరోగ్యం: సంఘం ప్రత్యేక అధికారి శ్రీనివాస్
రైతులు రసాయనిక ఎరువులను పక్కనపెట్టి, సేంద్రియ ఎరువుల వాడకం వైపు మొగ్గు చూపాలని నిజామాబాద్ జిల్లా సాలూర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ప్రత్యేక అధికారి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురువారం సంఘ ఆవరణలో నిర్వహించిన అర్థ సంవత్సర మహాజన సభకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రసాయనిక ఎరువుల వాడకం వల్ల పండించే పంటలు విషతుల్యమవుతున్నాయని, తద్వారా ప్రజలు క్యాన్సర్ వంటి భయంకర వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రైతు సేంద్రియ పద్ధతుల్లోనే సాగు చేస్తామని సభలో ప్రతిజ్ఞ చేయించారు.
లాభదాయకమైన పామాయిల్ సాగుపై రైతులు దృష్టి సారించాలని, ఇందుకు ప్రభుత్వం డ్రిప్ పరికరాలపై 80 నుంచి 100 శాతం వరకు సబ్సిడీ అందిస్తోందని వివరించారు. సాగు ఖర్చుల కింద ఎకరాకు రూ. 40 వేల నుంచి రూ. 45 వేల వరకు రాయితీ లభిస్తుందని పేర్కొన్నారు. అనంతరం ఇన్ఛార్జ్ సీఈఓ సంజీవ్ సంఘం యొక్క జమా ఖర్చుల వివరాలను రైతుల ముందుంచారు. మొక్కజొన్న కొనుగోలు నిబంధనలను సవరించి, రైతులు పండించిన మొత్తం దిగుబడిని కొనుగోలు చేయాలని సభలో తీర్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం మాజీ ఛైర్మన్ అల్లె జనార్ధన్, వైస్ ఛైర్మన్ సందీప్ రెడ్డి, మాజీ సీఈఓ బసవత్ రావు, సంఘ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.


