ఆధునిక సాగు దిశగా అడుగులు
- సాలూర లో రైతులకు ఇరిగేషన్ శాఖ దిశానిర్దేశం
సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ, ప్రతి ఎకరానికి నీరందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఇరిగేషన్ శాఖ అధికారులు పేర్కొన్నారు. రైతు వారములో భాగంగా శనివారం సాలూర రైతు వేదికలో నిర్వహించిన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. రైతులకు సాగునీటి ఇబ్బందులు కలగకుండా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఫతేపూర్ ప్రాంతంలో నీటి నిల్వ సమస్యలతో పాటు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల పునరుద్ధరణకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు. రూ. 31.44 లక్షల వ్యయంతో చేపట్టబోయే అభివృద్ధి పనుల ద్వారా స్థానిక ఆయకట్టుకు ఎంతో మేలు జరుగుతుందని భరోసా ఇచ్చారు. అధికారులు క్షేత్రస్థాయికి రావడం లేదనే అపోహలు వీడాలని, సర్వేలు మరియు అంచనాల రూపకల్పనలో తాము నిరంతరం క్షేత్రస్థాయిలోనే గడుపుతున్నామని స్పష్టం చేశారు. సాగునీటి వృధాను అరికట్టి, ఆధునిక పద్ధతుల్లో నీటిని వినియోగించుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా అధికారులను సంప్రదించాలని, రైతుల ముఖంలో చిరునవ్వు చూడటమే ప్రభుత్వ ఆశయమని ఈ సందర్భంగా వారు ఉద్ఘాటించారు. ఈ సదస్సులో ఇరిగేషన్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

