బంజారా మహిళ హత్యోదంతంపై నిందితులను కఠినంగా శిక్షించాలి
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో జరిగిన బంజారా మహిళ హత్యోదంతంపై అఖిల భారత బంజారా సేవా సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఏఐబీఎస్ మండల అధ్యక్షుడు స్వామి నాయక్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏఐబీఎస్ మండల అధ్యక్షుడు స్వామి నాయక్ మాట్లాడుతూ.. సీతాయిపేట గ్రామానికి చెందిన కాంతిని అమానుషంగా హత్య చేయడం అత్యంత హేయమైన చర్య అని పేర్కొన్నారు. నిందితులను గుర్తించి, వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. మహిళల రక్షణలో ప్రభుత్వం విఫలమైందని, దాడులు చేస్తున్న వారికి కనీస భయం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని, న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐబీఎస్ జిల్లా అధ్యక్షుడు మోహన్ నాయక్, డివిజన్ అధ్యక్షుడు శంకర్ నాయక్, నాయకులు మోహన్ నాయక్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

