పొలాలకు దారి మూసివేత.. అన్నదాతల ఆవేదన
సాగు భూములకు వెళ్లే మార్గాన్ని కొందరు వ్యక్తులు కంచె వేసి మూసివేయడంతో నిజామాబాద్ జిల్లా సాలూర శివారు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం బాధిత రైతులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన వ్యక్తం చేసి, ఇంచార్జి తహసీల్దార్ అనూషకు వినతిపత్రం అందజేశారు.
వివరాల్లోకి వెళ్తే.. సాలూర శివారులోని సర్వే నంబర్లు 22/50, 22/43, 22/28 పరిధిలో సుమారు 10 నుంచి 15 మంది రైతులకు చెందిన వ్యవసాయ భూములు ఉన్నాయి. ఈ పొలాలకు వెళ్లేందుకు ఎద్దుల బండ్లు సైతం వెళ్లేలా సులభమైన మార్గం ఉండేది. అయితే, ఇటీవల మెట్రో సిటీ పేరుతో జాకీర్ అనే వ్యక్తి ఆ మార్గంలో కంచె వేసి, గేటు ఏర్పాటు చేసి దారిని పూర్తిగా మూసివేశారని రైతులు ఆరోపించారు.
పంట కోత దశలో ఇబ్బందులు: ప్రస్తుతం పంటలు కోత దశలో ఉన్నాయని, దారి లేకపోవడంతో యంత్రాలు పొలాల్లోకి వెళ్లలేక పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పలుమార్లు సదరు వ్యక్తిని కోరినప్పటికీ, "ఇక్కడ ఎలాంటి దారి లేదు" అని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని వారు పేర్కొన్నారు. మనుషులు కూడా నడవలేని పరిస్థితి ఏర్పడిందని, వెంటనే రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పాత మార్గాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రైతులు అల్లే జనార్దన్, ఘంటే వీరేష్, శివరాజ్, మైదపు సంజు, సురేష్ పటేల్, జయరాం, హన్మంతు, అల్లే రమేష్, శ్రీకాంత్, సోక్కం ప్రశాంత్, కన్నె రాజు తదితరులు పాల్గొన్నారు.

