ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
- సాలూర తహసీల్దార్ నవాజ్కు వినతిపత్రం అందజేత
- సమస్యలు తీర్చకుంటే ఆగస్టు 29న 'ఛలో అసెంబ్లీ'
పాఠశాల విద్యను బలోపేతం చేయడంతో పాటు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సాలూర తహసీల్దార్ నవాజ్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ మెమోరాండంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఆర్థిక, సర్వీసు సంబంధిత సమస్యలను సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా ఆ సంఘ నాయకులు మాట్లాడుతూ... పాఠశాల విద్యా రంగంలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2023 జూలై 1 నాటి నుంచి నూతన పీఆర్సీ నివేదికను అమల్లోకి తీసుకురావాలని, సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 6 విడతల డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల రిటైర్మెంట్ భద్రతకు ముప్పుగా మారిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన మెడికల్, జీపీఎఫ్, గ్రాట్యుటీ తదితర పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం ప్రతి నెలా రూ. 2,000 కోట్లను బడ్జెట్లో కేటాయించాలని కోరారు. రాష్ట్రంలోని పాఠశాలల సంఖ్యను 27 వేల నుంచి 4 వేలకు కుదించే తీవ్ర నిర్ణయ ఆలోచనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్ను తక్షణమే విడుదల చేయడంతో పాటు, జీఓ 317 వల్ల స్థానికత కోల్పోయి తీవ్ర మానసిక వేదనకు గురవుతున్న ఉపాధ్యాయులను తిరిగి వారి సొంత జిల్లాలకు బదిలీ చేయాలని కోరారు. ప్రతి పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకోవాలని, కొత్త జిల్లాల్లో ఖాళీగా ఉన్న డిఈఓ, డిప్యూటీ డిఈఓ, ఎంఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ, సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం బేసిక్ పే అమలు చేయాలని, మోడల్ స్కూళ్లు, ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత శిక్షణల పేరిట ఉపాధ్యాయులను తరగతి గదులకు దూరం చేయకూడదని, యాప్ల నిర్వహణ, బోధనేతర బాధ్యతల నుంచి మినహాయింపు ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లపై వెంటనే స్పందించకపోతే ఆగస్టు 19న జిల్లా కేంద్రాల్లో భారీ ధర్నాలు, ఆగస్టు 29న హైదరాబాద్లో వేలాది మంది ఉపాధ్యాయులతో 'ఛలో అసెంబ్లీ' నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు.

